ENGLISH

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాఠాలు చెబితే..

14 April 2017-19:00 PM

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టీచర్‌గా కొత్త అవతారమెత్తింది. సినిమాలో గెటప్‌ కాదిది, రియల్‌ లైఫ్‌లోనే ఆమె టీచర్‌గా మారింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోగల ప్రభుత్వ పాఠశాలకు టీచర్‌గా పనిచేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆమె ఆంగ్ల పాఠాలు బోధించింది. ఇదంతా 'టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌' అనే గొప్ప ప్రయత్నంలో భాగం. సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి, యువ యాక్టివిస్ట్‌ చైతన్య 2014లో 'టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌' అనే సంస్థను ప్రారంభించారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌తోపాటు, లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌పై బోదనలు చేసేందుకోసం ఈ సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఉద్దేశ్యం చాలా మంచిది కావడంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలా ఇంగ్లీష్‌ టీచర్‌గా అవతారమెత్తి పాఠాలు చెప్పింది. రకుల్‌ పాఠాలు చెప్పడంతో ఆమె పాఠాల్ని శ్రద్ధగా విన్నారు విద్యార్థులు. సినిమా సెలబ్రిటీకి ఉండే క్రేజ్‌ ఎంతో అందరికీ తెలుసు. అంత పెద్ద స్టార్‌ తమ స్కూల్‌కి, టీచర్‌గా రావడం పట్ల చిన్నారులు ఆశ్చర్యపోయారు. ఆమె గొప్పతనాన్ని కొనియాడారు. ఇదిలా ఉండగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్యనే మంచు లక్ష్మితో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. మంచు లక్ష్మితో కలిసి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న రకుల్‌, ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో ఉంచింది కూడా.