ENGLISH

మాస్‌రాజా ఈ సారైనా ట్రెండ్‌ సెట్‌ చేస్తాడా?

09 February 2018-12:15 PM

రీ ఎంట్రీలో మాస్‌రాజా రవితేజ మునుపటిలా జోరు ప్రదర్శించలేకపోతున్నాడేమో అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. అందుకే ఈ సారి ఎలాగైనా మంచి హిట్‌ కొట్టి చూపించాలని కసిగా ఉన్నాడట. రీ ఎంట్రీలో వచ్చిన 'రాజా ది గ్రేట్‌' సినిమాతో ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన 'టచ్‌ చేసి చూడు'తో బాగా నిరాశపరిచాడు. దాంతో ఇప్పుడు అర్జెంటుగా రవితేజకి ఓ హిట్‌ కావాలి. మరో పక్క రవితేజ తదుపరి టేకప్‌ చేసిన ప్రాజెక్ట్‌ ఏంటా అంటే, కామెడీనే ప్రధాన ఫార్మేట్‌గా ఎంచుకుని ఒకప్పుడు సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టిన డైరెక్టర్‌ శ్రీనువైట్లతో రవితేజ సినిమా చేయబోతున్నాడు.

ప్రస్తుతం శ్రీను వైట్లకీ ఓ మంచి మాస్‌ హిట్‌ కావాలి. ఇటు రవితేజ పరిస్థితీ అంతే. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఓ మంచి మాస్‌ మసాలాని ప్లాన్‌ చేశారట. ఎప్పటినుండో శ్రీను వైట్ల ఈ స్టోరీని రవితేజతోనే చేయాలని పట్టు పట్టి కూర్చున్నాడట. అదే స్టోరీని ఇప్పుడు చిన్నా చితకా మార్పులు చేసి, మునుపటి రవితేజ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని స్టోరీని ప్రిపేర్‌ చేశాడట. ఆ సినిమాకి 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 'మిస్టర్‌' సినిమాతో కొత్తగా ట్రై చేసి శ్రీను వైట్ల పరాజయం పాలయ్యాడు. దాంతో ఇదివరకటి ఫార్ములానే ఫాలో చేసి, ఖచ్చితంగా హిట్‌ కొట్టాలనే తపనతో ఉన్నాడట శ్రీను వైట్ల.

గతంలో శ్రీను వైట్ల - రవితేజ కాంబినేషన్‌లో 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయ్‌ శీను' వంటి చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. అలాగే తాజా చిత్రం కూడా సక్సెస్‌ అవ్వాలని ఈ ఇద్దరూ కసరత్తులు చేస్తున్నారట. సినిమా మరికొద్ది రోజుల్లోనే సెట్స్‌ మీదికి వెళ్లనుంది. స్క్రిప్టు పనులు పూర్తి చేసుకుని పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడు శ్రీను వైట్ల. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్‌ని అమెరికాలో షూట్‌ చేయనున్నారట.

ALSO READ: 'పెళ్లిచూపులు' డైరెక్టర్‌ కొత్త సినిమా టైటిల్‌ విన్నారా?