ENGLISH

భీకరమైన గ్యాంగ్‌ వచ్చేస్తోంది

29 May 2017-16:35 PM


'దండు పాళ్యం 2' వచ్చేస్తోంది. గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. అప్పట్లో కన్నడలో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ అంతే ఆదరణ పొందింది. ఓ యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని తెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే ఓ గ్యాంగ్‌ కథ ఆధారంగా తెరకెక్కింది. థ్రిల్లర్‌ క్రైమ్‌ సబ్జెక్ట్‌ ఇది. ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆశక్తి నెలకొంది. రవిశంకర్‌, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, రవికాలే ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాలో. శ్రీనివాస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వెంకట్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా ఉండబోతోందట. ఓ భయంకరమైన గ్యాంగ్‌ వరుస హత్యలు చేస్తూంటే, వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు వేసే ఎత్తులు, వారి ఎత్తులకు చిత్తయ్యేలా 'దండుపాళ్యం' గ్యాంగ్‌ వేసే పై ఎత్తులు జనాన్ని కూర్చున్న చోట నుండి కదలనీయకుండా కట్టిపారేసేలా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకున్ని షాక్‌కి గురి చేసేలా ఉంటాయట. 'దండు పాళ్యం 1' సినిమాతో పోలిస్తే అంతకు మించి ఐదు రెట్లు ఎక్కువగా ఈ సినిమా ఉండబోతోందని డైరెక్టర్‌ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. వచ్చే నెల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: శివగామి పాత్ర కోసం శ్రీదేవి ఎంత అడిగిందో తెలుసా!