ENGLISH

'లక్ష్మీస్‌ వీరగ్రంధం' తర్వాత 'శశిలలిత'

16 December 2017-17:05 PM

ఎన్టీఆర్‌ బయోపిక్స్‌గా తెరకెక్కుతోన్న మూడు చిత్రాల్లో ఒకటి 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈయన మరో సెన్సేషనల్‌ టాపిక్‌ని తన తదుపరి చిత్రంగా ఎంచుకున్నారు. 

అదే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర. ఈ చరిత్రలో జయలలితతో పాటు, శశికళ పాత్ర కూడా కీలకం. అందుకే ఆయన తెరకెక్కించబోయే ఈ చిత్రానికి 'శశిలలిత' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారట. సినీ నటిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, రాజకీయాల్లో ఎలా ఎదిగారో ఓ చరిత్రగానే చెప్పొచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలితను ప్రజలు ఎంతో ప్రేమతో 'అమ్మ' అని పిలుచుకుంటారు. అంతటి అపారమైన అభిమానం ఆమె అంటే. ఇటీవల ఆమె మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ఆశక్తికర పరిస్థితులు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన సినిమాలో ఎక్కడి నుండి ఎక్కడి వరకూ ప్రస్థావిస్తారనేది తెలియాల్సి ఉంది. 

మరో పక్క వర్మ కూడా శశికళ హిస్టరీ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తాననీ గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం వర్మ చాలా బిజీ. చేయాల్సిన చాలా సినిమాలున్నాయి వర్మ చేతిలో. ప్రస్తుతం నాగార్జునతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. తర్వాత 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' తెరకెక్కించాల్సి ఉంది. అయితే కేతిరెడ్డి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా 'లక్ష్మీస్‌ వీరగ్రంధం'. ఈ సినిమా పూర్తి కాగానే 'శశిలలిత' చిత్రాన్ని పట్టాలెక్కించేస్తారట. 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించేందుకు పలువురు సీనియర్‌ హీరోయిన్లను పరిశీలించారు. అయితే ప్రస్తుతం ముద్దుగుమ్మ పూజా కుమార్‌ని ఈ సినిమా కోసం ఎంచుకున్నారనీ తెలుస్తోంది. పూజా కుమార్‌ ఇటీవలే 'గరుడవేగ' చిత్రంలో నటించింది. మరోపక్క 'శశిలలిత' సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందట.

ALSO READ: అనుష్క కి స్పెషల్ గిఫ్ట్ పంపిన దీపిక