ENGLISH

రోడ్డెక్కిన నందమూరి వివాదాలు

18 January 2024-10:49 AM

ఈ రోజు నందమూరి తారక రామారావు  వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామునే మొదట  జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు.  ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో ఉన్న  విభేదాలు మరోసారి  బయటపడ్డాయి. ఎప్పటి నుంచో నందమూరి ఫ్యామిలీకి  జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలున్నాయి.  అందుకనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. అప్పుడే వీరి మధ్య విబేధాలు బయట పడ్డాయి. ఓ సందర్భంలో ఎన్టీఆర్ గూర్చి బాలయ్యని అడగ్గా ఐ డోంట్ కేర్ అన్నారు బాలయ్య.


గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూ.ఎన్టీఆర్ ఫాన్స్ ఏర్పాటు చేశారు. జూ. ఎన్టీఆర్ ఘాట్ నుంచి వెళ్లిన కాసేపటికే, బాలయ్య ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు.  బాలకృష్ణ వెళ్లిన వెంటనే, కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని, బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 

దీంతో  నందమూరి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు మారిపోయింది. ఎన్టీఆర్  ఫాన్స్ కూడా ఈ విషయం  తెలిసి మండిపడుతున్నారు. తమ హీరోకి జరిగిన అవమానానికి రగిలిపోతున్నారు. ఫ్లెక్సీ లను తొలగించాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు.