చిరంజీవి - వశిష్ట కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'విశ్వంభర'. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. చిరంజీవి కూడా ఇంకా సెట్లో అడుగుపెట్టలేదు. అయితే ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో ఓ హాట్ కేక్లా మారింది. షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలైనా, అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి ఫ్యాన్సీ ఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ డీల్ ఇప్పటికే క్లోజ్ అయిపోయినట్టు సమాచారం. ఈ సినిమాని ఓవర్సీస్ లో రూ.18 కోట్లకు కొనుగోలు చేశార్ట. చిరంజీవి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డీల్.
ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేద్దామన్నది మేకర్స్ ప్లాన్. సంక్రాంతి సీజన్లో ఓ హిట్ సినిమా ఎంత వసూలు చేయగలదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'విశ్వంభర' ఓ సోషియో ఫాంటసీ మూవీ. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. సంక్రాంతి సీజన్కి అంతకంటే కావల్సింది ఏముంది? దాన్ని దృష్టిలో ఉంచుకొనే బయ్యర్లు ఈసినిమాని కొనడానికి ఎగబడుతున్నారని టాక్. దాదాపు రూ.150 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందుకే ఏరియాల వారిగానూ భారీ రేట్లే పలుకుతున్నాయి. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. మృణాళ్ ఠాకూర్కీ ఓ పాత్ర దొరికిందని సమాచారం అందుతోంది. త్వరలోనే చిరంజీవి 'విశ్వంభర' సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు.