ENGLISH

దర్శకులుగా మారుతున్న కొరియోగ్రాఫర్స్

26 May 2024-19:24 PM

టాలీవుడ్ లో చాలామంది కొరియో గ్రాఫర్స్ దర్శకులుగా మెగా ఫోన్ పెట్టారు. డాన్స్ మాస్టర్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించి తర్వాత కాలంలో దర్శకులుగా మారుతున్నారు. గతంలో ప్రభుదేవా, లారెన్స్, గణేష్ మాస్టర్, విజయ్ బిన్నీ లాంటి వారు దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా, హీరోగా సక్సెస్ అయ్యాక దర్శకునిగా 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా' సినిమా తీసి సూపర్ హిట్ సాధించాడు. రెండో సినిమా ప్రభాస్, త్రిషలతో పౌర్ణమి తెరకెక్కించాడు. లారెన్స్ కూడా దర్శకునిగా మారి స్టైల్, మాస్, రెబెల్, డాన్, ముని, లాంటి సినిమాలు తీసాడు. ఇప్పటికీ దర్శకునిగా తన జర్నీ కొనసాగిస్తున్నాడు. 


రీసెంట్ గా విజయ్ బిన్నీ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారి నాగార్జునతో నా సామి రంగా సినిమాని  తెరకెక్కించాడు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. విజయ్ బిన్నీ మొదటి ప్రయత్నంలోనే విజయం సాదించాడు. ఇప్పుడు ఇదే దారిలో ఇంకొక కొరియో గ్రాఫర్ చేరాడు అతనే సతీష్ రాజ్. ఇతను అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి నిర్మాతగా కూడా  మారతున్నాడు. ఈ క్రమంలోనే సతీష్ రాజ్ మూవీ జంక్షన్ అనే పేరుతో  సొంత బ్యానర్ ని స్థాపించాడు. త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు మొదలుకానున్నట్లు అనౌన్స్ చేసాడు. 


ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటీవ్ దర్శకులు ఎక్కువమందే ఉన్నారు. వీరంతా తెలుగు  సినిమా స్థాయిని పెంచారు. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది అంటే మన టాలీవుడ్ దర్శకులే కారణం. వీళ్ళ స్పూర్తితో మరికొందరు దర్శకులుగా మారటానికి ప్రయత్నిస్తున్నారు.