ENGLISH

పరారీలో డైరెక్టర్ క్రిష్

29 February 2024-12:31 PM

హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ దొరికినా, టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు ఉంటున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ కూరుకుపోయింది అని మరోసారి రుజువయ్యింది. ఈ సారి డ్రగ్స్ కేస్ లో టాలీవుడ్ విలక్షణ డైరక్టర్ క్రిష్ ఉండటం గమనార్హం.  గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్‌ పార్టీలో క్రిష్ కూడా ఉన్నారని, ఈ పార్టీ కోసం డ్రగ్‌ సరఫరా చేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌.  ఇదే హోటల్‌లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్‌ చేసినట్లు, ఇంతక ముందు కూడా చాలాసార్లు డ్రగ్‌ పార్టీలు చేసుకున్నట్లు  సయ్యద్ అబ్బాస్ తన వాంగ్మూలంలో చెప్పినట్లు డీసీపీ తెలిపారు.
  

గమ్యం, వేదం, కంచె లాంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకున్న క్రిష్ చాలామందికి ఆదర్శం. అలాంటి క్రిష్ ఇప్పుడు డ్రగ్ కేస్ లో పట్టుబడటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  క్రిష్ ఆపార్టీ లో డ్రగ్స్ తీసుకున్నారో లేదో అన్న విషయం విచారణ చేస్తున్నామని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్‌ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్‌ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.  డ్రగ్స్ కేసులో FIR  A10 గా క్రిష్ ను పేర్కొన్నారు. గత ఏడాది నుంచి వివేక్ డ్రగ్స్ కి బానిస అయ్యారని, రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకునేవారని చెబుతున్నారు.


ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఇంతలోనే క్రిష్ పరారీలో ఉన్నట్లు, ఆయనుకు CRPC 160 కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు కోర్టుకి రిపోర్ట్ చేశారు. ఇంకో వైపు ఇదే కేసులో పట్టుబడ్డ యూట్యూబర్ లిషి మిస్సింగ్ అని పోలీసులకి కంప్లైన్ట్ అందింది. నిజంగా క్రిష్ వివేక్  ని కలవటానికే వస్తే, డ్రగ్స్ తీసుకోనట్లయితే ఎందుకు పరారీలో ఉన్నారని, వైద్య పరీక్షలకి ఎందుకు అటెండ్ అవలేదని, పలువురు సందేహం వెలిబుచ్చుతున్నారు.