ENGLISH

Nagarjuna: మిస్ ఇండియాతో నాగ్ రొమాన్స్‌

24 February 2023-13:00 PM

నాగార్జునకు బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈమ‌ధ్య చేదు ఫ‌లితాలు వ‌స్తున్నాయి. వైల్డ్ డాగ్, ద ఘోస్ట్ చిత్రాలు దారుణంగా నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ర‌చ‌యిత‌గా కొన్ని విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ప‌ని చేశాడు ప్ర‌స‌న్న కుమార్‌. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు. నాగ్ కోసం ఓ క‌థ రెడీ చేసుకొన్నాడు. ఇందులో అల్ల‌రి న‌రేష్‌, రాజ్ త‌రుణ్‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. క‌థానాయిక‌గా మిస్ ఇండియా 2020.. మాన‌స వార‌ణాసిని ఎంపిక చేసుకొన్న‌ట్టు తెలుస్తోంది. మాన‌స‌ది హైద‌రాబాదే. మోడ‌ల్‌గా బిజీగా ఉంది. త‌ను చేయ‌బోయే తొలి తెలుగు సినిమా ఇదే.

 

ఇటీవ‌ల మాన‌స - నాగార్జున‌ల‌తో ఓ ఫొటో షూట్ చేసిన‌ట్టు టాక్‌. ఫొటో షూట్ లో... వీరిద్ద‌రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండ‌డంతో.. క‌థానాయిక‌గా మాస‌న ఎంపిక ఖాయ‌మైన‌ట్టు తెలుస్తోంది. న‌రేష్‌, రాజ్ త‌రుణ్‌ల‌ది క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర అని తెలుస్తోంది. ఓ మ‌ల‌యాళ చిత్రాన్ని ప్ర‌స‌న్న కుమార్ రీమేక్ చేస్తున్న‌ట్టు ముందు వార్త‌లొచ్చాయి. అయితే ఇది రీమేక్ కాద‌ని, సొంత క‌థ‌ని స‌మాచారం. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి.