ENGLISH

రోడ్డెక్కిన మెగా వివాదాలు

14 May 2024-20:30 PM

తెలుగు ఇండస్ట్రీ అంటే ముందు గుర్తు వచ్చేది మెగా ఫ్యామిలీ. ఈ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవిని ఈ ఫ్యామిలీకి ఇంటి పెద్దగా చూస్తారు. ఇండస్ట్రీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా చిరు ముందుటారు. ఇండస్ట్రీ లో అంతా ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుపించుకుంటారు. పండగలు వచ్చినా, స్పెషల్ అకేషన్స్ వచ్చినా అంతా సందడిగా ఒక చోట సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా మందికి మెగా ఫ్యామిలీ ఒక ఆదర్శం. ఇదంతా ఎందుకంటే ఇలాంటి మెగా ఫ్యామిలీ  మధ్య ఇప్పుడు వివాదాలు చెలరేగుతున్నాయి. ఎప్పటి నుంచో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయినట్టు ప్రచారం జరుగుతోంది.  లేటెస్ట్ గా నాగ బాబు చేసిన పోస్ట్ తో ఆ వార్తలకి బలం చేకూరింది.  


ఏపీ ఎన్నికల సందర్భంగా ఈ వివాదం మరింత ముదిరి, రోడ్డెక్కింది . ఏపీ లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా, ఇండస్ట్రీ లో చాలా మంది ముందుకు వచ్చారు. ప్రచారాల్లో పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా పవన్ కి సపోర్ట్ చేశారు. చిరు పవన్ కి ఓటు వేయమని, అతన్ని గెలిపించమని వేడుకున్నారు. అంతే కాకుండా ప్రచారానికి రామ్ చరణ్, సురేఖ పిఠాపురం వెళ్లారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారం నిర్వహించటానికి నంద్యాల వెళ్లారు. దీంతో మెగా ఫాన్స్,  మెగా హీరోలు కూడా బన్నీపై ట్రోల్స్ చేస్తున్నారు.   


తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పదించిన బన్నీ పార్టీ పరంగా కాకుండా, ఫ్రెండ్షిప్ కోసం ప్రచారానికే వెళ్లినట్టు పేర్కొన్నాడు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందిస్తూ. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ పోస్ట్ చేసాడు. బన్నీ పేరు ప్రస్తావించకపోయినా, బన్నీని ఉద్దేశించి నాగ బాబు పోస్ట్ చేసారని తెలుస్తోంది. ఈ పోస్ట్ తో మెగా, అల్లు ఫాన్స్ మధ్య వార్ నడుస్తోంది.