ENGLISH

నాగబాబు మీడియా జర్నీ ఎవరికోసం?

10 August 2024-13:53 PM

ఎన్నికల ముందు నుంచి మెగా బ్రదర్ నాగబాబు మీడియాలో బాగా హైలెట్ అవుతున్నారు. ఇన్నాళ్లు సినిమాల్లో, ఇండస్ట్రీలో కనిపించే నాగబాబు మార్క్, ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తోంది. టాలీవుడ్ లో నాగ బాబు జర్నీ ప్రత్యేకం. సహాయ నటుడిగా, తండ్రిగా, అన్నగా, నిర్మాతగా ప్రయాణం సాగించిన నాగ బాబు తరవాత కాలంలో టెలివిజన్ రంగం లోకి అడుగుపెట్టారు.  టీవీ నిర్మాతగా, హోస్ట్ గా, జడ్జ్ గా తన దైన ముద్ర వేశారు. ఇప్పుడు తమ్ముడికి సపోర్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా తెరవెనక ఉండి జనసేన కి సపోర్ట్ చేస్తున్నారు. వెనకుండి అన్ని తానై చూసుకుంటున్నారు. 


రాజకీయాల్లో పదవులు ఆశించకుండా ఎవరు ఏమి చేయరు, అలాంటిది నాగ బాబు ఎలాంటి పదవీ కాంక్ష లేకుండా కేవలం ఏపీ ప్రజల అభివృద్ధి కోసం కూటమికి అండగా పని చేసారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. జనసేన నూటికి నూరు శాతం విజయం సాధించటంలో నాగబాబు పాత్ర కీలకం. ఇప్పుడు మరో కొత్త జర్నీకి మెగా బ్రదర్ సిద్ధమయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, కామెడీ షోలు చేసారు. ఇప్పుడు N మీడియా అని కొత్త మీడియా సంస్థని ప్రారంభించారు.  


N మీడియా లోగోని  రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి కొత్తగా ప్రారంభించారు. ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించనున్నారు. భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా  లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదంతా జనసేన కోసం ఒక మీడియా ఉండాలనే ఉద్దేశ్యం తోనే నాగబాబు మీడియా రంగం లోకి అడుగుపెట్టారని, భవిష్యత్తులో శాటిలైట్ ఛానల్ కూడా పెడతారని టాక్.