ENGLISH

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత: నాగార్జున ఎమోషనల్ పోస్ట్

24 August 2024-14:34 PM

తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో 'హైడ్రా' పలువురికి నిద్ర లేకుండా చేస్తోంది.  రేవంత్ సర్కార్ హైడ్రా చీఫ్‌గా రంగనాథ్‌ కి బాధ్యతలు అప్పగించిన దగ్గరనుంచి అక్రమ నిర్మాణాలపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగా మొదట చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టి వాటన్నింటినీ కూల్చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 44 ఏళ్ళలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే తెప్పించుకుని,  శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించిన ఒరిజినల్ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కంపేర్ చేసి  అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికీ పలువురి నిర్మాణాలు, గెస్ట్ హౌస్ లు కూల్చేశారు. మణికొండ చిత్రపురి కాలనీలో కూడా పెద్ద ఎత్తున విల్లాలను కూల్చేశారు. తాజాగా ఎన్ కన్వెన్షన్ ని కూడా నేలమట్టం చేసేస్తున్నారు.


టాలీవుడ్ సినీ హీరో అక్కినేని నాగార్జునకి చెందిన మాదాపూర్ 'ఎన్ కన్వెన్షన్' ని కూడా హైడ్రా కూల్చేస్తోంది. కారణం ఈ ఎన్ కన్వెన్షన్ తుమ్ముడికుంట చెరువుని ఆక్రమించి కట్టడమే. నాగార్జునకు సంబంధించిన ఈ 'ఎన్‌ కన్వెన్షన్‌' పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై పదేళ్ల క్రితం కేసీఆర్ చర్యలు ప్రారంభించారు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు అప్పటిలోనే వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ కు చెరువు నీళ్లు ఆనుకుని ఉంటాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే పరిశీలించిన అధికారులు దీనిని కూల్చివేస్తున్నారు. 


భారీ పోలీసు బందోబస్తు మధ్య శనివారం తెల్లవారు జామునుంచే ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత జరుగుతోంది. మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్​ కన్వెన్షన్ నిర్మించారన్న పిర్యాదుతోనే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది.


హైడ్రా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయటంతో నాగార్జున స్పదించారు. దీనిపై ఎలాంటి  ఇంటిమేషన్ లేకుండా, ముందస్తు నోటీసు జారీ చేయకుండా ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారని, కేసు ఇంకా కోర్టులో ఉందని, అయినా  హైడ్రా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరి కాదని, తాను కూడా  చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని, ఒక వేళ కోర్టులో తనకి తీర్పు వ్యతిరేకంగా వస్తే నేనే స్వయంగా ఆ నిర్మాణాన్ని కూల్చేవాడినని నాగార్జున X వేదికగా పోస్ట్ చేశారు.  


హైడ్రా ఇలా అక్రమ నిర్మాణమని కూల్చటం వలన ప్రజలకి తప్పుడు సందేశం వెళ్తుందని,   మేం ఆక్రమణలు చేశామని, కబ్జాలు చేశామని ప్రజలు అపార్థం చేసుకునే అవకాశముందని నాగ్ వాపోయారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు నాగార్జున. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి నిర్మాణాలు చేయలేదని, అది పట్టా భూమి. ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు నాగ్.