ENGLISH

Chiru, Balayya: ఐటెమ్ సాంగులు... దొందూ దొందే!

26 December 2022-13:21 PM

ఈ సంక్రాంతి కి చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాలు రెండూ పోటీ ప‌డుతున్నాయి. చిరు 'వాల్తేరు వీర‌య్య‌'గా.. బాల‌య్య 'వీర సింహారెడ్డి' ఈ పండ‌క్కి వ‌స్తున్నాయి. రెండు సినిమాల ప్ర‌చార‌మూ మొదలైపోయింది. ఇప్ప‌టికే పాట‌ల్ని విడుద‌ల చేసి, హ‌డావుడి చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ ఐటెమ్ గీతాలున్నాయి. అవి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య‌' నుంచి 'బాస్ పార్టీ' పాట రిలీజ్ అయ్యింది. ఇప్పుడు బాల‌య్య సినిమా నుంచి 'మ‌నోభావాలు' గీతం వ‌చ్చింది.

 

'బాస్ పార్టీ' విన‌గానే ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. పైగా.. దేవిశ్రీ ప్ర‌సాద్ రాసిన ఈ సాహిత్యం కూడా ఏమంత బాగాలేదు. కాక‌పోతే... చిరంజీవి పాట క‌దా.. మెల్ల మెల్ల‌గా ఎక్కేసింది. ఇప్పుడు 'మ‌నోభావాలు' పాట కూడా అంతే. త‌మ‌న్ అందించిన ట్యూన్ మ‌రీ అంత క్యాచీగా లేదు. రామ‌జోగ‌య్య శాస్త్రి అందించిన సాహిత్యం జ‌స్ట్ ఓకే అనిపించింది. కాక‌పోతే.. ఈ పాట కూడా విన‌గా విన‌గా శ్రోత‌ల‌కు ఎక్కేస్తుంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. రెండింటిలో ఉన్న ఇన్‌స్టెంట్ విష‌యం... చిరు, బాల‌య్య ఈ పాట‌ల్లో స్టెప్పులు ఇర‌గ‌దీసిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. సో. ఈ పాట‌లు రెండూ థియేట‌ర్లో పేలే అవ‌కాశం ఉంది. ఆడియో ప‌రంగా మాత్రం... ఈ రెండు పాట‌లూ జ‌స్ట్ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయాయి.