ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి దాదాపు 30 మంది సెలబ్రెటీలు పాల్గొంటారని వార్తలొచ్చాయి. అందులో చాలామంది మిస్ అయ్యారు. కాకపోతే.. రామ్ చరణ్, వెంకటేష్, నాగచైతన్య, అడవిశేష్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ... వీళ్లంతా వేదికపై కనిపించేసరికి కాస్త కళ వచ్చింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కీ ఆహ్వానం అందింది. ఆయనా వస్తాడనుకొన్నారంతా. కానీ.. ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల రాలేకపోతున్నానని ఓ సందేశం పంపించాడు. నిన్నే ఎన్టీఆర్ పుట్టిన రోజు. తన తాతయ్యని అభిమానుల ముందు స్మరించుకోవడానికీ, తన ప్రేమని చాటుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక ఉండదు. అందుకే ఎన్టీఆర్ వచ్చి ఉండుంటే బాగుండేదన్నది అందరి మాట.
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ.. వీళ్లంతా సమకాలికులు. బాలయ్య పిలుపు మేరకు చిరు స్థానంలో చరణ్ వచ్చాడు. వెంకీ హాజరయ్యాడు. నాగ్ ప్లేసులో చైతూ కనిపించాడు. సో.. ఆయా హీరోల ప్రాతినిథ్యం వేదికపై కనిపించింది. కానీ... ఎన్టీఆర్ మాత్రం రాలేకపోయాడు. కనీసం.. కల్యాణ్ రామ్ అయినా వేదికపై కనిపించాల్సింది. ఈ వేడుకకు కల్యాణ్ రామ్ ఎందుకు రాలేకపోయాడన్న విషయంలో క్లారిటీ లేదు. బాలయ్య - నాగార్జున మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అయినా సరే... నాగ చైతన్య వచ్చాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రావడానికి ఏమైందన్నది అందరి అనుమానం. ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది.