ENGLISH

మహేష్‌తో మళ్ళీ ‘మైండ్‌ బ్లాంక్‌’ చేసేస్తుందా?

18 September 2020-15:01 PM

రష్మిక మండన్న కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, గత సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఈ ఏడాది సూపర్‌ హిట్‌తో కెరీర్‌కి మంచి ఊపు తెచ్చుకున్న రష్మిక, ఆ వెంటనే ‘భీష్మ’తో మరో హిట్టు కొట్టింది. కరోనా వచ్చిపడిందిగానీ, లేకపోతే.. రష్మిక జోరు ఇంకో రేంజ్‌లో వుండేదిప్పుడు. అయితేనేం, వరుస సినిమాలతో బిజీగా వుందీ కన్నడ బ్యూటీ. ఇదిలా వుంటే, మరోమారు రష్మిక, మహేష్‌తో జతకట్టనుందనీ, అయితే ఈసారి పూర్తిస్థాయి హీరోయిన్‌లా కాకుండా, గెస్ట్‌ రోల్‌కే ఆమె పరిమితమవుతుందనీ ప్రచారం జరుగుతోంది. మహేష్‌ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.

 

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో గతంలో ‘గీత గోవిందం’ సినిమా చేసింది రష్మిక. దాంతో, పరశురామ్.. రష్మికని లక్కీ మస్కట్‌గా భావిస్తూ, ఆమెని ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఓ స్పెషల్‌ రోల్‌లో తీసుకోనున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనున్న విషయం విదితమే. ఇంతకీ, మరోమారు మహేష్‌తో రష్మిక తెరపై ‘మైండ్‌ బ్లాక్‌’ చేసెయ్యడం ఖాయమేనని ఫిక్సయిపోవచ్చా?

ALSO READ: 'అమ‌రం అఖిలం ప్రేమ‌' మూవీ రివ్యూ & రేటింగ్!