ENGLISH

'2.0' సీక్వెల్‌ షురూ అవుతోందా?

06 November 2018-12:34 PM

'రోబో' తర్వాత '2.0' సినిమా రావడానికి చాన్నాళ్ళే పట్టింది. ఇలాంటి సినిమాల కోసం ఎంత కష్టపడాలో శంకర్‌కి మాత్రమే తెలుసు. ఇంకోసారి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఆయన చేయగలడా.? అంటే, 'కథ కుదిరితే త్వరలోనే దీనికి సీక్వెల్‌ వస్తుంది..' అని శంకర్‌, '2.0' సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా వ్యాఖ్యానించడంతో, అప్పుడే ఆ సీక్వెల్‌ కోసం ప్లానింగ్‌ జరిగిపోతోందంటూ గాసిప్స్‌ షురూ అయ్యాయి. 

వాస్తవానికి '2.0' సినిమాలో నటించడానికి రజనీకాంత్‌ అంతగా ఆసక్తి చూపలేదట. శంకర్‌, బలవంతంగా ఒప్పించి చేయించాడట. కారణం, రజనీకాంత్‌ అనారోగ్య సమస్యలే. ఎలాగైతేనేం, '2.0' సినిమా పూర్తయి, ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి, సీక్వెల్‌ గురించి రజనీకాంత్‌ని అడిగితే? చాన్సే లేదట. ఎందుకంటే, ఇలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి చేయలేనని రజనీకాంత్‌ చెప్పేశాడట. దాంతో శంకర్‌ ముందు మూడు ఆప్షన్లు వచ్చిపడ్డాయి. 

ఒకటేమో రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కాగా, ఇంకొకటి అజిత్‌. మరో ఆప్షన్‌ విజయ్‌. సూర్య గురించి కూడా కొంత ఆలోచన వున్నా, ఎక్కువ కాలం డేట్స్‌ సూర్య నుంచి దక్కడం కష్టమే. సినిమా కోసం కమిటెడ్‌గా ఎక్కువ రోజులు డేట్స్‌ ఇచ్చేది వీరిలో ధనుష్‌ ఒక్కడే. పైగా, ఆయన రజనీకాంత్‌ అల్లుడు. బోల్డంత స్టార్‌డమ్‌ ధనుష్‌కీ వుంది కోలీవుడ్‌లో. 

బాలీవుడ్‌లోనూ, తెలుగు సినీ పరిశ్రమలోనూ ధనుష్‌కి వున్న గుర్తింపు తక్కువేమీ కాదు. సో, శంకర్‌ గనుక '2.0'కి సీక్వెల్‌ తీస్తే, ఖచ్చితంగా అందులో ధనుష్‌ హీరోగా నటించే అవకాశాలున్నాయన్నమాట.

ALSO READ: యంగ్‌ టైగర్‌ 'ఎన్టీఆర్‌' రాక తప్పదేమో!