ENGLISH

Naga Chaitanya: చైతూ వ‌దిలేసిన క‌థ ఇదేనా?

07 February 2023-10:00 AM

గీత గోవిందం కాంబినేష‌న్ మళ్లీ రిపీట్ అవ్వ‌బోతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `గీత గోవిందం` సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మ‌రో సినిమా శ్రీ‌కాకం చుట్టుకొంది. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రానికి నిర్మాత‌లు. ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

 

గీత గోవిందం త‌ర‌వాత‌... ప‌ర‌శురామ్ పెద్ద డైరెక్ట‌ర్ల లిస్టులో చేరిపోయాడు. ఆ వెంట‌నే... మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` తీశాడు. ఈ సినిమా యావ‌రేజ్ మార్కు ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఆ త‌ర‌వాత‌... నాగ‌చైత‌న్య‌తో ఓసినిమా చేయాల్సివుంది. చైతూ కోసం ఓ క‌థ రెడీ చేశాడు ప‌ర‌శురామ్. కానీ ఆ క‌థ ఎందుకో చైతూకి ఎక్క‌లేదు. దాంతో ఆప్రాజెక్టు కాన్సిల్ అయ్యింది. చైతూ ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో.. వెంట‌నే విజ‌య్ ని క‌లిసి కాంబో ఓకే చేయించుకొన్నాడు ప‌ర‌శురామ్‌. చైతూ కోసం రెడీ చేసిన క‌థ‌నే.. కాస్త అటూ ఇటూ మార్చి విజ‌య్‌కి సెట్ చేశాడ‌ని తెలుస్తోంది. గీత గోవిందం లానే ఇది రొమాంటిక్ కామెడీ సినిమా. క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.