ENGLISH

శృతి మించుతున్న కంగనా రనౌత్‌ ఆగడాలు.

04 September 2020-15:00 PM

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనా రనౌత్‌కి సాటి ఇంకెవరూ రారు. సంచలనాలకు మారు పేరు అనే గుర్తింపు కోసం ఏ స్థాయి వివాదాస్పద వ్యాఖ్యలైనా ఆమె చేస్తుంటుంది. ఎవర్నయినా తూలనాడటం కంగనా రనౌత్‌కి అలవాటే. కానీ, కొన్ని సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి కూడా. తాజాగా రియా చక్రవర్తి - సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ వివాదానికి సంబంధించి కంగన చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయ దుమారం కూడా రేగుతోంది. ‘ముంబైలో అడుగు పెట్టనీయం..’ అని ఓ పార్టీకి చెందిన నేతలు కంగనపై మండిపడితే, ‘ముంబై ఏమైనా పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో వుందా.?’ అంటూ నోరు జారింది కంగనా రనౌత్‌.

 

ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తుంటారు. అలాంటివాటిని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడతానంటే ఎలా.? సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ జరుగుతోంది. డ్రగ్స్‌ ఆరోపణలు, ఇతరత్రా ఆరోపణలపైనా విచారణ లోతుగానే సాగుతోంది. ఈలోగా కంగనా ఎవరో ఒకరి మీద విమర్శలు చేయడం, అట్నుంచి వచ్చే ప్రతి విమర్శలకు ఇంకా గట్టిగా ప్రతిస్పందిస్తూ సంయమనం కోల్పోవడం శోచనీయం. కంగనా రనౌత్‌కి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు వుంది.

 

అయితే, దాన్ని చెడగొట్టుకోవడం కోసమే ఆమె ప్రయత్నిస్తోందా.? పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందా.? అన్న చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతోంది. ‘టెంపర్‌మెంట్‌’ శృతిమించితే.. ఎలా ఎదిగిందో అలాగే పతనమవుతుందని హెచ్చరిస్తున్నారు కంగనా రనౌత్‌ని చాలామంది.

ALSO READ: Kangana Ranaut Latest Photoshoot