నయనతార తిరుమల సందర్శన వివాదాలకు దారి తీస్తోంది. ఇటీవల విఘ్నేష్ శివన్ని నయనతార పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్లయ్యాక... తొలిసారి భర్తతో కలిసి తిరుమలకు వచ్చింది. అయితే.. ఆలయ ఆవరణలో నయన కాళ్ల చెప్పులతో నడవడం వివాదాస్పదమైంది. అత్యంత పవిత్రమైన స్థలంలో ఇలా చెప్పులతో నడిచి అపచారం చేసిందని నయనపై హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. తిరుమలలో ఫొటో షూట్లు చేయడం నిషిద్ధం. అయినా సరే, కొత్తదంపతులు అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చారు. నయన ఒక్కర్తే కాదు... ఫొటోగ్రాఫర్లు కూడా కాళ్లకు చెప్పులతోనేకనిపించారు. దాంతో.. అందరూ మండిపడుతున్నారు.
ఈవిషయంలో తిరుమల సిబ్బంది వైఫల్యం కూడా ఉంది. సెలబ్రెటీలను చూడగానే.. వాళ్లు ఆచారాలను పక్కన పెట్టేస్తారు. వాళ్లు కూడా ఫ్యాన్స్ లా ఫీలైపోతారు. `చెప్పులు పక్కన పెట్టి ఫొటో షూట్ చేసుకోండి` అని ఒక్కరూ అనలేదు. దాంతో ఎవరికీ అడ్డూ అదుపూ లేకుండా పోయింది. టీటీడీ కూడా ఈ విషయంపై విచారణ చేపట్టింది. తప్పు ఎవరిదో తెలుసుకుంటామని చెబుతోంది. ఈ వ్యవహారంపై నయనతారకు నోటీసులు జారీ చేస్తామంది. అయితే.. విషయం గ్రహించిన నయన.. ముందుగానే అందరికీ `సారీ` చెప్పేసి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.
ALSO READ: 'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ & రేటింగ్