ENGLISH

ఏడాదికి ఒక్కటి చాలదంటోన్న నితిన్‌

30 March 2018-11:04 AM

'అ,ఆ' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసి, సక్సెస్‌ బండి ఎక్కేశాడనుకున్న నితిన్‌, గతేడాది 'లై' సినిమాతో నిరాశ పరిచాడు. కానీ ఈ ఏడాది మాత్రం అలా కాదట. ఖచ్చితంగా బాక్సాఫీస్‌ హిట్‌ కొడతానంటున్నాడు. ఇప్పటికే నితిన్‌ చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. త్వరలోనే 'ఛల్‌ మోహనరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నితిన్‌. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్క్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ అందించిన కథ ఆధ్యంతం వినోదాత్మకంగా సాగిపోనుందట. కాగా ఈ సినిమాతో పాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'దాగుడు మూతలు' సినిమాలో నితిన్‌ నటిస్తున్నాడు. ఇది మల్టీస్టారర్‌ సినిమాగా రూపొందుతోంది. నితిన్‌ - రాశీఖన్నా జంటగా 'శ్రీనివాస కళ్యాణం' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు రూపొందిస్తున్నారు. 

దిల్‌రాజు - నితిన్‌ కాంబినేషన్‌ అంటే సక్సెస్‌ పక్కా అనే నమ్మకం ఉంది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ సెట్టయ్యింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి గెటప్స్‌లో నితిన్‌ - రాశీఖన్నా జంట చూడ చక్కగా ఉంది. ఏదో ఫోటోల కోసం అన్నట్లుగా కాకుండా, నేచురల్‌గా లైవ్‌గా ఆకట్టుకుంటున్నారు వీరిద్దరూ. 

ఇది కాక 'ఛలో' డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నితిన్‌. అలాగే ప్రవీణ్‌ సత్తారు ఓ డిఫరెంట్‌ కథని నితిన్‌కి వినిపించాడట. ఆ కథలో నటించేందుకు నితిన్‌ సిద్ధంగా ఉన్నానంటున్నాడు. ఇలా ఇన్ని సినిమాలను నితిన్‌ లైన్‌లో పెట్టేశాడు. నితిన్‌ ప్లాన్‌ చూస్తుంటే, ఇకపై ఏడాదికి ఒక్కటి కాదు, కనీసం రెండు మూడు సినిమాలతో రావడానికి రెడీగా ఉన్నాడనీ తెలుస్తోంది.

ALSO READ: 'రంగస్థలం'కి పైరసీ టెన్షన్‌.?