ENGLISH

జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా - పోసాని

24 May 2019-18:00 PM

మొదటి నుండీ జగన్‌పై అభిమానాన్ని చాటుకునే వ్యక్తి పోసాని కృష్ణ మురళి. సినిమాల్లో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా చెలామణి అవుతోన్న పోసానికి రాజకీయాలకొచ్చేసరికి జగన్‌ అంటే వీరాభిమానం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌కి ఆంధ్రప్రదేశ్‌ జనం అఖండ విజయాన్ని కట్టబెట్టినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోసాని 'వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నది నా కోరిక.

 

ఆ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన సీఎం కావాలని దేవుళ్లకు మొక్కుకున్నా. ఆ కోరిక నెరవేరడంతో, అమీర్‌పేట్‌, బేగంపేట్‌, ఫిలిం నగర్‌ ఆలయాల్లో దేవుళ్లకు మెక్కుబడులు తీర్చుకున్నా. జగన్‌పై తప్పుడు కేసులు బనాయించిన చంద్రబాబు వాటిని ఉపసంహరించుకోవాలి. ఇంతటి ఘన విజయం దక్కించుకున్న జగన్‌ని చూసి చంద్రబాబులో మార్పు రావాలి.

 

కుట్రలు, కుతంత్రాలూ, మోసాలు మానేస్తే చంద్రబాబుకు పాదాభివందనం చేస్తా. జనరంజక పాలన చేసి, మంచి పేరు తెచ్చుకుని, జగన్‌ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా.. కేసీఆర్‌ సీఎం కావాలని కూడా గతంలో ఇలాగే దేవుణ్ణి కోరుకున్నా, అప్పుడూ దేవుడు నా మొర ఆలకించి కోరిక తీర్చాడు, ఇప్పుడూ నా కోరిక తీర్చాడు. కష్టాల నుండి తేరుకుని ప్రస్తుతం ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను..' అని పోసాని అన్నారు.

ALSO READ: ఎన్నిక‌లు అయిపోయాయ్‌... మెగా బ్ర‌ద‌ర్స్ ప‌రిస్థితేంటి?