ENGLISH

వేగం పెంచిన 'సాహో'.!

24 August 2018-14:21 PM

'బాహుబలి'తో యూనివర్సల్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రబాస్‌ తదుపరి చిత్రం 'సాహో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే దుబాయ్‌లోని పలు కాస్ట్‌లీ లొకేషన్స్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చిన సాహో టీమ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సందడి చేస్తోంది. ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్స్‌లో 'సాహో' షూటింగ్‌ జరుగుతోంది. 

యాక్షన్‌ ప్రధానాంశంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడూ తెలుగు తెరపై కనీ వినీ ఎరుగని రీతిలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఓ క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీని ఈ సినిమాలో చూపించబోతున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా నటిస్తోంది. మరో బాలీవుడ్‌ బ్యూటీ ఎవ్లీన్‌ శర్మ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. బాలీవుడ్‌ తారాగణం ఎక్కువగా నటిస్తున్నారు ఈ సినిమాలో. హీరోయిన్స్‌తో పాటు, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, సీనియర్‌ నటి మందిరాబేడీ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

'బాహుబలి' విజయంతో సుజిత్‌ ముందుగా అనుకున్న స్టోరీలో పలు మార్పులు చేశారు. ప్రబాస్‌ స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా నార్మల్‌గా రాసుకున్న తన స్టోరీని అత్యంత పవర్‌ఫుల్‌గా మార్చేశాడు. 

ఇకపోతే, ఇంతవరకూ కొంచెం స్లోగా సాగిన చిత్రీకరణను ఇకపై వేగవంతం చేయనున్నారట. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 'సాహో'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తాజా సమాచారమ్‌.
 

ALSO READ: నీవెవ‌రో మూవీ రివ్యూ & రేటింగ్