ENGLISH

రష్మిక ఇకపై టాలీవుడ్‌కి చిక్కదా.?

25 December 2020-17:00 PM

రష్మిక మండన్న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దాంతో, ఇకపై ఆమె సౌత్‌ సినిమాల్లో నటించదేమో.? అన్న అనుమానాలు షురూ అయ్యాయి. ఇదంతా ఆమెకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారమేనట. 'నేనెప్పుడూ తెలుగు సినిమాకి ప్రత్యేకమైన గౌరవం ఇస్తాను. ఎందుకంటే, ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్టార్‌డమ్‌ తెలుగు సినిమా కారణంగా వచ్చిందే..' అంటూ ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చేసింది రష్మిక.

 

అయినాగానీ, 'మిషన్‌ మజ్ను' అనే బాలీవుడ్‌ సినిమా అనౌన్స్‌ అవడం, ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు రష్మిక చెప్పడంతో, 'ఇకపై సౌత్‌ సినిమా.. అందునా తెలుగు సినిమా రష్మికను మర్చిపోవచ్చు..' అన్న ప్రచారం తెరపైకొచ్చింది. దాంతో, అది ఆమె కెరీర్‌ మీద గట్టి దెబ్బే కొట్టే అవకాశం వుంటుంది. సౌత్‌ సినిమాలు చేస్తూ, బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే, బాలీవుడ్‌లో సినిమాల నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతుంటుంది.

 

దాంతో, తెలుగు సినిమాలకి కావొచ్చు, తమిళ, కన్నడ సినిమాలకు కావొచ్చు తగినంత సమయం కేటాయించడం కష్టమవుతుంది. ఇది చాలామంది హీరోయిన్లకు గతంలో సమస్యగా మారింది. అలా ఆయా హీరోయిన్లు బాలీవుడ్‌ సినిమాల్ని వదిలేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. కొందరు, సౌత్‌ సినిమాల్ని వదిలేశారు కూడా. కానీ, రష్మిక మాత్రం 'ఆ బ్యాలెన్స్‌ మంత్రం నాకు తెలుసు' అంటోంది. పుకార్లను నమ్మవద్దని చెబుతోంది. బాలీవుడ్‌కి వెళ్ళినా, తన తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకేనని కుండబద్దలుగొట్టేసింది రష్మిక.

ALSO READ: హాస్పిటలో రజనీ.. ఫ్యాన్స్ కలవరం