ENGLISH

వరుస ఆఫర్స్ తో భానుమతి

15 May 2024-17:24 PM

సాయి పల్లవికి సౌత్ లో మంచి పేరు ఉంది. ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. మళయాలం మాతృ భాష అయినా అన్ని భాషల్లోనూ సాయి పల్లవిని ఓన్ చేసుకుంటారు. ఏ భాషా సినిమా అయినా తనే  స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఫిదా సినిమాతో భానుమతిగా అందరి హృదయాల్లో నాటుకుపోయింది. రాకెట్ స్పీడ్ లో కెరియర్ ఉంటుందని అంతా భావించారు కానీ సాయి పల్లవి అభిప్రాయాలూ , ఆలోచనలు వేరు తనకి నచ్చిన పాత్ర అయితే ఒప్పుకుంటుంది. తనకి తనే కొన్ని కండీషన్స్ పెట్టుకుని సినిమాలు చేస్తోంది. కేవలం గ్లామర్ కే పరిమితం అయిన పాత్రలు కాకుండా, నటనకి అవకాశమున్న పాత్రలు ఎంచుకుంటూ వెళ్ళటం వలన తక్కువ సినిమాలు చేసింది. 


గంగి గోవు పాలు గరిటడైనా చాలు అన్నట్టుగా చేసిన ఒకటి రెండు సినిమాలు అయినా ప్రేక్షకుల ప్రశంసలు పొందితే చాలు, ఉపయోగం లేనివి ఎన్ని చేసిన వేస్ట్ అన్నట్టు ఉంటుంది సాయి పల్లవి ఆలోచన. తెలుగులో చివరిగా విరాటపర్వం లో రానా తో కలిసి నటించింది. చాలా గ్యాప్ తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగులో నాగ చైతన్య తో 'తండేల్' సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా అమీర్ ఖాన్ కొడుకు తో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. తన మొదటి బాలీవుడ్ మూవీ రిలీజ్ కాకముందే, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ రామాయణ్ లో సీతగా ఫిక్స్ అయ్యింది. 


నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ్ మూవీలో రణభీర్ రాముడిగా నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి నటిస్తోంది. బాలీవుడ్ లో అంత మంది క్వీన్స్ ఉండగా ఆ అవకాశం సాయి పల్లవిని వరించింది అంటే దానికి ఆమె టాలెంట్ కారణమని చెప్పొచ్చు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కాకుండా తెలుగులో మరి కొన్ని అవకాశాలు అందుకుంటునట్టు టాక్. దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.  దర్శకుడు సాయి పల్లవిని దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్ ని రాసుకున్నాడంట. కొంచెం లేట్ అయినా వరుస అవకాశాలతో సాయి పల్లవి బిజీ అవుతోంది. ఇంకో రెండు మూడేళ్లు ఆమె డైరీ ఫుల్ అని చెప్పొచ్చు.