ENGLISH

ఈ సినిమాలు... చూడాలి మళ్ళీ మళ్ళీ!

23 February 2024-15:49 PM

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అదే రీ రిలీజ్ పర్వం. అది హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా మళ్ళీ రీ రిలీజ్ చేసి దండిగా వసూళ్లు చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ లు హీరోల  బర్త్ డే సందర్భంగాను, ఎదో ఒక అకేషన్ పురస్కరించుకుని చేస్తున్నారు. ఈ ట్రెండ్ మొదలు పెట్టింది మహేష్ ఫాన్స్.  కొన్ని సినిమాలు రెండో సారి రిలీజ్ అయ్యి కూడా రికార్డ్ సృష్టిస్తున్నాయి. మరికొన్ని అప్పుడు డిజాస్టర్ లు ఇప్పుడు జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. సిద్దార్థ్ నటించిన 'ఓయ్'మూవీ అప్పుడు  ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా, రీసెంట్ గా వాలెంటెన్స్ డే కి రీ రిలీజ్ చేయగా, యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం టాలీవుడ్  హీరోల సినిమాలే కాదు, కోలీవుడ్ హీరో సూర్య సినిమా కూడా 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్', 7 /G బృందావన కాలనీ    కూడా మంచి కలక్షన్స్ ని రాబట్టాయి.
                     

ఈ క్రమంలోనే  మరి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొత్త సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించలేని సిద్దార్థ్ పాత సినిమాల రీరిలీజ్ తో మెప్పిస్తున్నాడు. మొన్న ఓయ్ తో వచ్చిన సిద్దు ఇప్పడు బొమ్మరిల్లు మూవీతో రానున్నాడు. జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ మూవీని భాస్కర్  డైరక్ట్ చేశారు.  2006 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి అందర్నీ మెప్పించిన ఈ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ నెలలో హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ సినిమాలు  మంచి సక్సెస్ ని సాధించాయి.  ‘వెంకీ’ రీ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు  ‘దుబాయ్ శ్రీను’ రీ రిలీజ్ కోసం థియేటర్స్ సిద్ధం అవుతున్నాయి. ఫిబ్రవరి 24, 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నయనతార జోడిగా నటించింది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్- రాజమౌళి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సింహాద్రి' మార్చ్ 1, న   వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ చేస్తున్నారు. నందమూరి నటసింహం బాలయ్య , సిమ్రాన్ జోడిగా అలరించిన బ్లాక్ బస్టర్  మూవీ 'సమర సింహారెడ్డి' కూడా మార్చ్ 2  న రీ రిలీజ్ చేసున్నారు. మహేష్ బాబు ఒక్కడు సినిమా మూడో సారి థియేటర్స్ లో అలరించనుంది. ఇప్పటికే గత ఏడాది జనవరి 7 న రీరిలీజ్ చేశారు. నైజాం ఆంధ్రప్రదేశ్ లలో 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 23,24, 25 తేదీలలో రెండు  తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్పెషల్ షోస్ తో విడుదల చేయబోతున్నారు. మరి ఈసారి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.