ENGLISH

ప‌వ‌న్ సినిమాతో.. చావో - రేవో..

26 May 2022-13:37 PM

ఏ.ఎం ర‌త్నం... టాలీవుడ్ లో సూప‌ర్ హిట్లు, భారీ సినిమాలు తీసిన నిర్మాత‌. ర‌త్నం సినిమా అంటే, కోట్ల‌కు కోట్లు ధార‌బోయాల్సిందే. ఆయ‌న సినిమాల్లోనే సంపాదించాడు. సినిమాల్లోనే పోగొట్టాడు. చాలా ఏళ్లుగా ర‌త్నం నుంచి సినిమా రాలేదు. ఆయ‌న సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ప‌వ‌న్ సినిమాతో.. మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ చేద్దామ‌న్న‌ది ర‌త్నం ఆశ‌. అయితే ఆ ప్ర‌యాణం అంత స‌జావుగా జ‌ర‌గ‌డం లేదు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొద‌లెట్టారో గానీ, అన్నీ బ్రేకులే. ముందు క‌రోనా అడ్డు క‌ట్ట వేసింది. ఆ త‌ర‌వాత `భీమ్లా నాయ‌క్‌` అడ్డు ప‌డింది. ఇప్పుడు కూడా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్ ముక్కుతూ మూలుగుతూ సాగుతుంది. ఈ సినిమాని అప్పులు తెచ్చి మొద‌లెట్టాడు ర‌త్నం. అయితే వాటికి వ‌డ్డీలు పెరుగుతూ పోతున్నాయి. అవుట్ పుట్ పై కూడా ప‌వ‌న్ సంతృప్తిగా లేడ‌ని వార్త‌లొస్తున్నాయి. దాంతో రీషూట్లు త‌ప్ప‌డం లేదు. క్రిష్ కెరీర్ లో భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేదు. ఇంత ఖ‌ర్చు పెట్టి - ఈ సినిమాకి వ‌సూళ్లు రాక‌పోతే... ఏఎంర‌త్నం ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే ఈ సినిమా బ‌డ్జెట్ పెరిగింది. వ‌డ్డీల‌తో క‌లిసి త‌డిసి మోపెడు అవుతోంది. ఎంత ఖ‌ర్చ‌యినా... సినిమా హిట్ట‌యితే చాలు. క‌చ్చితంగా రిట‌ర్న్స్ వ‌స్తాయి. ఫ్లాప‌యితే మాత్రం. అంతే సంగ‌తులు. దాంతో.. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు... ర‌త్నంకి చావో రేవో అన్న‌ట్టు మారింది. క్రిష్ ఏం చేస్తాడో మ‌రి.

ALSO READ: వీర‌భ‌ద్ర‌మ్‌.. మ‌ళ్లీ వచ్చాడు