ENGLISH

గెట్‌ రెడీ ఫర్‌ 'కాంచన ప్లస్‌ గీతాంజలి'

16 December 2017-12:38 PM

రష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రంతోచెప్పుకోదగ్గ విజయం అందుకున్న నిర్మాత రాజ్‌ కుమార్‌. అభిరుచి గల నిర్మాతల్లో ఈయన ఒకరు అని చెప్పొచ్చు. తాజాగా ఈయన నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సారి కూడా అలాంటి బోల్డ్‌ అటెంప్టే చేస్తారా అనేది ప్రశ్న ఫిల్మ్‌ వర్గాల్లో తలెత్తుతోంది. అయితే ఈ చిత్రంతో ఖచ్చితంగా డిఫరెంట్‌ ప్రయత్నం అయితే చేయబోతున్నారనీ తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నంది అవార్డు విన్నర్‌ అయిన కర్రి బాలాజీ తెరకెక్కిస్తున్నారు. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. 

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. ఈ చిత్రంలో అంజలి, లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'గీతాంజలి' సినిమాతో ముద్దుగుమ్మ అంజలి మంచి విజయం అందుకుంది. అంజలి నటించిన తొలి హారర్‌ చిత్రం ఇది. మంచి సక్సెస్‌ని తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో నటనకుగానూ అంజలి ఇటీవల నంది అవార్డు కూడా అందుకుంది. తాజాగా అంజలి 'బలూన్‌' అనే ఓ హారర్‌ చిత్రంలో నటిస్తోంది. జై కథానాయకుడుగా నటిస్తున్నాడు. డిశంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక మరో నటి లక్ష్మీరాయ్‌ తమిళంలో లారెన్స్‌ తెరకెక్కించిన 'కాంచన' చిత్రంతో పాపులర్‌ అయ్యింది. ఇటీవలే ఈ బ్యూటీ 'జూలీ - 2' అనే హిందీ చిత్రంలో నటించింది. కానీ ఆశించిన సక్సెస్‌ని అందుకోలేకపోయింది. అయినా కానీ ఈ చిత్రం లక్ష్మీరాయ్‌ పాపులారిటీని మరింత పెంచేసింది. మెగాస్టార్‌ 150వ చిత్రంలో రత్తాలు ఐటెం సాంగ్‌లో నటించి, మెగా ఐటెం బాంబ్‌ అనిపించుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతోనూ తెరకెక్కుతోన్న చిత్రమే ఈ తాజా చిత్రం. 

కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమట. ఖచ్చితంగా ఆడియన్స్‌కి కొత్త అనుభూతినిస్తుందంటున్నారు. అంతేకాదు ఖచ్చితంగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకూ మంచి పేరు తీసుకొస్తుందని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

ALSO READ: నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న అనసూయ?!