ENGLISH

సురేఖపై నాగ్ మరొక దావా?

05 October 2024-12:53 PM

కొండా సురేఖ అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు. సురేఖ పొలిటికల్ వార్ లో భాగంగా అనూహ్యంగా చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. నాగార్జున కుటుంభంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ మొత్తం కొండా సురేఖకి వ్యతిరేఖంగా మారింది. ఆమె తన తప్పు తెలుసుకుని ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా విమర్శలు ఆగటం లేదు.  తనపై, తన కుటుంబంపై అసంబద్ధ, అసత్య ఆరోపణలు చేసిన సురేఖ పై ఆక్కినేని నాగార్జున ఇప్పటికే క్రిమినల్ కేసు వేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల్ని పొల్లు పోకుండా ఆధారాలతో సహా కంప్లైంట్ లో ఫైల్ చేసారు. 


ఇది కాకుండా త్వరలో 100కోట్లకు పరువు నష్టం దావా వేసే ఆలోచనలో కూడా ఉన్నారట నాగ్. కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా తగ్గేది లేదని,క్రిమనల్ పరువు నష్టం దావాని ఉపసంహరించు కోనని తెలిపారు. తాజాగా 'టైమ్స్‌ నౌ' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ 'తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని సురేఖ ఇప్పుడు చెప్తున్నారు. సమంతకు క్షమాపణ చెప్పారు. మరి నా కుటుంబం సంగతేంటి, నాకూ, నా కుటుంబానికి క్షమాపణ చెప్పారా ' అని నాగ్ ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఫ్యామిలీకి సంబంధించిన విషయమని, ఆమె చేసిన ఈ అసత్య ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని దాటి వెళ్లాయని ఆవేధన చెందారు.


తమ కుటుంభంపై వచ్చిన విమర్శల్ని యావత్‌ తెలుగు చిత్ర పరిశ్రమ ఖండించింది, ఇందరి సపోర్ట్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెపై చట్టపరంగా మేం తీసుకునే చర్యలు మిగతా రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక అని, ఇక నుంచి తమ కీర్తిప్రతిష్టలు తగ్గించే వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని నాగార్జున తెలిపారు. పరువు నష్టం దావా కేసులు ఏళ్ళ తరబడి సాగినా పోరాటానికి తాను సిద్దమే అని నాగ్ తెలిపారు.