ENGLISH

బన్నీ, మహేష్‌ల వంతొచ్చింది

05 April 2018-09:00 AM

సంక్రాంతికి భారీ సినిమాలతో స్టార్ట్‌ అయిన టాలీవుడ్‌ సీజన్‌ అంతే భారీగా నిరాశపరిచింది. బోనీ డల్‌గా ఉండడంతో టాలీవుడ్‌కి ఆ డల్‌నెస్‌ ఇంతవరకూ వీడలేదు. ఎట్టకేలకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఆ డల్‌నెస్‌ నుండి టాలీవుడ్‌ని గట్టున పడేశాడు. 'రంగస్థలం' సినిమాతో తిరుగులేని సక్సెస్‌ కొట్టాడు రామ్‌చరణ్‌. 

ఇప్పుడు 'రంగస్థలం' మేనియా ముగిసే సరికి మరో ఇద్దరు స్టార్‌ హీరోలు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వారే మహేష్‌, అల్లు అర్జున్‌. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఈ ఇద్దరు మరింత జోష్‌గా ఉన్నారట. ఈ ఇద్దరికీ లాస్ట్‌ సినిమాలు నిరాశ పరిచాయి. మహేష్‌ 'స్పైడర్‌'తో నిరాశ పరచగా, వరుస సక్సెస్‌లతో వస్తున్న బన్నీకి 'డీజె' బెడిసికొట్టింది. సో ఇప్పుడు ఈ ఇద్దరికీ రానున్న సినిమాలు వెరీ ప్రెస్టీజియస్‌ మూవీస్‌. సినిమాలపై అంచనాలు కూడా అలానే ఉన్నాయి. చరణ్‌ అంతకు మించి అనే రేంజ్‌లో అంచనాలను అందుకున్నాడు. 

ఇక నెక్ట్స్‌ రాబోతున్నది మహేష్‌బాబు 'భరత్‌ అనే నేను' చిత్రం. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌ అంటే అంచనాలు ఆకాశాన్నంటేలానే ఉన్నాయి. ఇక బన్నీ నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాపై కూడా ఇదే రకమైన అంచనాలున్నాయి. 

రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు కథలందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సమ్మర్‌లో రానున్న ఈ రెండు భారీ సినిమాలు టాలీవుడ్‌ ప్రెస్టేజ్‌ని మరోసారి నిలబెట్టాల్సి ఉంది. 'రంగస్థలం' సినిమాతో చరణ్‌ తీసుకొచ్చిన బాక్సాఫీస్‌ సక్సెస్‌ని ఈ రెండు సినిమాలు కొనసాగిస్తాయో లేదో చూడాలిక.

ALSO READ: నేను చనిపోయాక కూడా నటిస్తా: బాబూమోహన్