రైటర్లు డైరెక్టర్లుగా మారడంలో వింతేం లేదు. త్రివిక్రమ్, కొరటాల, అనిల్ రావిపూడి.. వీళ్లంతా రచయితలుగా ప్రయాణం మొదలెట్టినవాళ్లే. ఆ తరవాత టాప్ డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు మరో రైటర్.. మెగాఫోన్ పట్టుకొంటున్నాడు. తనే ప్రసన్నకుమార్ బెజవాడ. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాలతో.. రచయితగా గుర్తింపు తెచ్చుకొన్నారు ప్రసన్నకుమార్. ఆయన ప్రయాణం.. జబర్దస్త్ తో మొదలైంది. ఇప్పడు ధమాకాకి ఆయనే కథ అందించారు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకొంటున్న రచయితల్లో ప్రసన్నకుమార్ ఒకరు. ఇప్పుడు డైరెక్టర్ గా మారుతున్నారు.
నాగార్జున కోసం ఆయన ఓ కథ తయారు చేశార్ట. ఇది నాగ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే ఇది సొంత కథ కాదు. ఓ రీమేక్. మలయాళ చిత్రం పొరింజుమరియమ్ జోస్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. `ఘోస్ట్` తరవాత నాగ్ మరో సినిమా ఒప్పుకోలేదు. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా కథని నాగ్ ఓకే చేశారు. అందులో అఖిల్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.