ENGLISH

27 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ మేక‌ప్‌

06 December 2021-12:10 PM

భానుప్రియ సోద‌రు శాంతి ప్రియ గుర్తుండే ఉంటుంది. మ‌హ‌ర్షి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమాలోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్టే. తెలుగు నాట‌.. ఏదో ఓ చోట ఆ పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి. అలా శాంతి ప్రియ‌ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మ‌హ‌ర్షి త‌ర‌వాత‌... ‘సింహస్వప్నం’, ‘యమపాశం’, ‘నాకు పెళ్లాం కావాలి’ తదితర సినిమాల్లో నటించింది. కానీ అవేం పెద్ద‌గా గుర్తింపు తీసుకురాలేదు. కొన్ని హిందీ సినిమాల్లో న‌టించినా ఉప‌యోగం లేకుండా పోయింది. ఆ త‌ర‌వాత‌..పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.ఇప్పుడు ఆమె దృష్టి మ‌ళ్లీ సినిమాల‌పై ప‌డింది. సుమారు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకున్నారు.

 

సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో హిందీలో ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. సమిత్ కక్కడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను జీ స్డూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో శాంతి ప్రియ ఓ కీల‌క పాత్ర పోషించారు. అవ‌కాశాలు వ‌స్తే.. మ‌ళ్లీ సినిమాలు, షూటింగుల‌తో బిజీ అవుదామ‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్నారామె. అందుకోసం ఓ పీఆర్‌నీ, మేనేజ‌ర్‌నీ నియ‌మించుకుంద‌ట‌. చూద్దాం... సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా శాంతి ప్రియ మెప్పిస్తుందేమో..?

ALSO READ: నాలుగో రోజూ దుమ్ము రేపిన అఖండ‌