ENGLISH

20 ఏళ్ళ తరవాత నాగ్ మళ్ళీ అలాంటి పాత్రలో..

26 April 2024-13:24 PM

కింగ్ నాగార్జున కి ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. ప్రయోగాలు చేయటానికి ముందు ఉంటాడు ఈ మన్మథుడు అయినా అవి కూడా డిజాస్టర్లే. చాలామంది  కొత్త దర్శకుల్ని పరిచయం చేసిన ఘనత నాగ్ కి దక్కుతుంది. సంక్రాంతికి విజయ్ బిన్నీ అనే కొరియో గ్రాఫర్ ని పరిచయం చేస్తూ నా సామిరంగా మూవీతో వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి 'కుభేర' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అంతే కాదు లోకేష్ కనక రాజ్, రజనీ కాంత్ కాంబోలో వచ్చే మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. కుబేర మూవీలో నాగ్ క్యారక్టర్ ఏంటి అనే విషయం  ఇప్పటివరకు రివీల్ కాలేదు. అయితే రీసెంట్ గా నాగ్ పాత్ర పై క్లారిటీ వచ్చింది. 


శేఖర్ కమ్ముల మొదటిసారిగా తన జోనర్ నుంచి బయటికి వచ్చి యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ  ముంబై మురికివాడల నేపథ్యంలో ఉండనుంది అని సమాచారం. ఇందులో నాగార్జున పవర్ ఫుల్ పోలీసు ఆఫిసర్ గా కనిపించనున్నారట. శివమణి తరవాత నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. శివమణి సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు. దాదాపు 20 ఏళ్ళ తరవాత శేఖర్ కమ్మల కోసం   ఖాకీ చొక్కా వేసుకుంటున్నాడు.    


ఇప్పటికే  బ్యాంకాక్ లో  కొంత షూటింగ్ జరుపుకున్న 'కుబేర' టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో  కీలక షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. రష్మికా మందన్న ధనుష్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్ సరసన హీరోయిన్ ఉంటుందా లేదా అన్నది తెలియదు.  'కుబేర' చిత్రాన్ని శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.