ENGLISH

చెర్రీ, చైతూ మొదలెట్టేశారోచ్‌

19 January 2018-10:31 AM

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా, డివివి దానయ్య నిర్మాణంలో కొత్త సినిమా పట్టాలెక్కింది. ఈ కాంబినేషన్‌ ఎప్పుడో సెట్స్‌ మీదకు వెళ్ళవలసి ఉందిగానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ కాంబినేషన్‌ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కింది. 

ఓ వైపు 'రంగస్థలం' సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే, ఇంకో వైపు చరణ్‌ - బోయపాటి శ్రీను సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ నేడే పట్టాలెక్కింది. బోయపాటి అంటే మాస్‌ డైరెక్టర్‌. రామ్‌చరణ్‌ ఏ జోనర్‌కి అయినా సెట్టయిపోయే హీరోనే అయినా, మాస్‌ ఎంటర్‌టైనర్స్‌ని క్లాస్‌గా డీల్‌ చేసే సత్తా ఉన్న హీరో. అలా బోయపాటి - చరణ్‌ కాంబినేషన్‌కి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. 

ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా కూడా ఈ రోజే ప్రారంభమవుతుండడం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి. అందాల భామ అను ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నాగచైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' సినిమా చేస్తోన్న సంగతి తెలిసినదే. మారుతి సినిమాలంటేనే ఎంటర్‌టైనర్‌కి అందులో పెద్ద పీట తప్పనిసరి. నాగచైతన్యతో మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్‌లిమిటెడ్‌ అనే స్థాయిలో ఉండబోతోందట. 

రామ్‌చరణ్‌ సినిమా విషయానికొస్తే, ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుందని సమాచారమ్‌. అయితే ఆమె మెయిన్‌ హీరోయిన్‌గా చేస్తుందా? లేదంటే స్పెషల్‌ రోల్‌ చేస్తుందా? అనే సస్పెన్స్‌ వీడలేదు. బోయపాటి గత రెండు చిత్రాల్లోనూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే బోయపాటి, తన గత రెండు సినిమాల్లోనూ కేథరీన్‌తో నటింపజేశాడు. ఈ సినిమాలోనూ కేథరీన్‌ ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుందనే గాసిప్‌ వినవస్తోంది.

ALSO READ: పవన్ కళ్యాణ్ కి కొత్త బిరుదు ఇచ్చిన లావణ్య త్రిపాఠి